3 కాబట్టి మోషే ప్రజలతో, “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి వెళ్లి యెహోవా వారి మీద తీర్చుకోవాలనుకున్న ప్రతీకారాన్ని తీర్చుకోండి. 4 ఇశ్రాయేలు యొక్క ప్రతి గోత్రం నుండి వేయిమంది పురుషులను యుద్ధానికి పంపండి” అని చెప్పాడు. 5 కాబట్టి ఇశ్రాయేలు వంశాల నుండి పన్నెండువేలమంది పురుషులు ఆయుధాలతో యుద్ధం కోసం సిద్ధపడ్డారు. 6 మోషే వారిని యుద్ధానికి పంపాడు, ప్రతి గోత్రం నుండి వేయిమందిని పంపాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, తనతో పాటు పరిశుద్ధాలయం నుండి పరికరాలు సంకేతం ఇవ్వడానికి బూరలు తీసుకున్నాడు.
7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మిద్యానుతో వారు పోరాడారు, ప్రతి మగవాన్ని హతం చేశారు. 8 చచ్చినవారిలో అయిదుగురు మిద్యాను రాజులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ. వారు బెయోరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు. 9 ఇశ్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీలను, పిల్లలను బందీగా తీసుకుని వారి పశువులను, మందలను, వారి ఆస్తిని దోచుకున్నారు. 10 వారు మిద్యానీయులు నివసించే పట్టణాలన్ని, వారి శిబిరాలతో, తగలబెట్టారు. 11 వారు తీసుకున్న దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన వాటిని, మనుష్యులు, పశువులతో సహా, 12 బందీలను, కొల్లగొట్టిన వాటిని, దోపుడుసొమ్మును తీసుకువచ్చారు యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో ఉన్న మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలు సమాజం దగ్గరకు తీసుకువచ్చారు.
13 మోషే, యాజకుడైన ఎలియాజరు సమాజ నాయకులు వారిని కలుసుకోడానికి శిబిరం బయటకు వచ్చారు. 14 మోషే సైన్య అధికారులు అనగా, యుద్ధం నుండి తిరిగివచ్చిన సహస్రాధిపతులు శతాధిపతులపై కోప్పడ్డాడు.
15 “స్త్రీలందరిని మీరు బ్రతకనిచ్చారా?” అని మోషే వారిని అడిగాడు. 16 “వీరు బిలాము సలహా ప్రకారం పెయోరు సంఘటనలో ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉండడానికి పురికొల్పినవారు, వీరి మూలంగా యెహోవా ప్రజలు తెగులు ద్వారా మొత్తబడ్డారు. 17 ఇప్పుడు అబ్బాయిలందరిని చంపండి. స్త్రీలలో పురుషులతో లైంగిక సంబంధం కలిగినవారిని చంపండి, 18 కానీ కన్యగా ఉన్న ప్రతి అమ్మాయిని మీ కోసం బ్రతకనివ్వండి.
19 “ఎవరైనా ఎవరినైన చంపినా, లేదా చంపబడిన వారిని తాకినా, తాకినవారు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడవ రోజున ఏడవ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ బందీలను కూడా శుద్ధి చేయాలి. 20 మీ బట్టలను తోలుతో, మేక వెంట్రుకలతో, చెక్కతో చేయబడిన ప్రతీ వస్తువును శుద్ధి చేసుకోవాలి.”
21 అప్పుడు యాజకుడైన ఎలియాజరు యుద్ధానికి వెళ్లిన సైనికులతో, “యెహోవా మోషేకు ఇచ్చిన నియమం ఇది: 22 బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, 23 అగ్నిని తట్టుకోగలిగిన దేనినైనా అగ్నిలో వేయాలి, ఆపై అది శుద్ధి అవుతుంది. కానీ అది కూడా శుద్ధి జలంతో శుద్ధి చేయబడాలి. అలాగే అగ్నిని తట్టుకోలేని దానిని ఆ నీటిలో వేయాలి. 24 ఏడవ రోజు మీరు బట్టలు ఉతుక్కోండి, మీరు శుద్ధులవుతారు. ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు.”
32-35 సైనికులు తీసుకున్న కొల్లగొట్టిన వాటిలో మిగిలి ఉన్న దోపుడుసొమ్ము 6,75,000 గొర్రెలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 మంది పురుషులతో పడుకొనని కన్యలు.
42-46 సైనికుల భాగం నుండి ఇశ్రాయేలు సమాజం కోసం మోషే వేరుగా ఉంచిన సగభాగం ఇది: 3,37,500 గొర్రెలు, 36,000 పశువులు, 30,500 గాడిదలు, 16,000 మంది మనుష్యులు. 47 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఇశ్రాయేలీయుల సగభాగంలో నుండి, ప్రతి యాభైమంది మనుష్యుల్లో నుండి ఒకరిని, జంతువుల్లో నుండి ఒకదాన్ని ఎంచుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇచ్చాడు.
48 తర్వాత సైన్యానికి అధికారులుగా ఉన్న సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే దగ్గరకు వచ్చి, 49 మోషేతో, “మేము సైనికుల లెక్క చూశాము. మాలో ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు. 50 కాబట్టి యెహోవా సన్నిధిలో మాకు ప్రాయశ్చిత్తం కలగాలని మేము భుజ కడియాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, మెడ హారాలు యెహోవాకు అర్పణగా తెచ్చాము” అని చెప్పారు.
51 మోషే, యాజకుడైన ఎలియాజరు వారి నుండి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. 52 సహస్రాధిపతుల నుండి, శతాధిపతుల నుండి వారు తీసుకుని, యెహోవాకు అర్పణగా అర్పించిన బంగారం మొత్తం 16,750 షెకెళ్ళు.[a] 53 ప్రతి సైనికుడు తన కోసం తాను దోపుడుసొమ్మును తీసుకున్నాడు. 54 సహస్రాధిపతుల శతాధిపతుల దగ్గర నుండి మోషే, యాజకుడైన ఎలియాజరు ఆ బంగారం తీసుకుని ఇశ్రాయేలీయులకు యెహోవా ఎదుట జ్ఞాపకార్థంగా సమావేశ గుడారంలో ఉంచారు.
<- సంఖ్యా 30సంఖ్యా 32 ->- a అంటే సుమారు 190 కి. గ్రా. లు
Languages