5 కొంతమంది, ఆ మనుష్యుల సంగతి దావీదుకు చెప్పినప్పుడు, వారు చాలా అవమానించబడినట్లు గ్రహించిన రాజు వారి దగ్గరకు మనుష్యులను పంపి, “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఉండి, ఆ తర్వాత రండి” అని చెప్పాడు.
6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, హానూను అమ్మోనీయులు వేయి తలాంతుల[a] వెండిని పంపి అరాము నహరయీము[b] నుండి, అరాము మయకా నుండి, సోబా నుండి రథాలను, రథసారధులను కిరాయికి తీసుకున్నారు. 7 వారు 32,000 రథాలను, రథసారధులను, మయకా రాజును, అతని సైన్యాన్ని కిరాయికి తీసుకున్నారు. వారు మెదెబా దగ్గరలో శిబిరం ఏర్పరచుకున్నారు, ఆ సమయంలో అమ్మోనీయులు తమ పట్టణాల నుండి సమకూడి యుద్ధం చేయడానికి వెళ్లారు.
8 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు. 9 అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. అక్కడికి వచ్చిన రాజులు విడిగా పొలాల్లో ఉన్నారు.
10 యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు. 11 మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచాడు, వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు. 12 యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి; అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను నేను రక్షిస్తాను. 13 ధైర్యంగా ఉండు, మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.
14 అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు. 15 అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు కూడా యోవాబు సోదరుడైన అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
16 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు దూతలను పంపి, యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించారు. హదదెజెరు సేనాధిపతియైన షోఫకు వారిని నడిపించాడు.
17 దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి వెళ్లాడు; వారికి ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాడు. దావీదు అరామీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాక వారు అతనితో యుద్ధం చేశారు. 18 అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు. దావీదు వారిలో 7,000 మంది రథసారధులను 40,000 సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోఫకును కూడా చంపాడు.
19 హదదెజెరు సేవకులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి దావీదుతో సమాధానపడి అతనికి లొంగిపోయారు.
Languages